పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు ‘మామూళ్ల’ మత్తులో తూలుతుండడంతో అమడగూరు మండలంలో రాజ్యమేలుతోంది. అక్రమార్కులు నిత్యం వందలాది టిప్పర్లతో మండల కేంద్రంలోని దేవరగుడి చెరువు నుంచి మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో చెరువు మట్టి తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టి రూ.4 వేల ప్రకారం ఇటుక బట్టీలు, పొలాలతో పాటు కొంత మంది కర్ణాటకకు తరలించి జేబులు నింపుకుంటు న్నారు. వంకలు, చెరువుల్లో దొరికే ఇసుకను కూడా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తరలించడంతో చెరువు కట్ట దెబ్బ తింటోందని, ఇప్పటికైనా దేవర గుడి చెరువును రక్షించాలని కోరుతున్నారు.


