అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మూడోదశ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న జిల్లా ప్యాప్టో నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపత్రాలు విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తామని తీర్మానించారు. 25న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. సమావేశంలో ప్యాప్టో చైర్మన్ శ్రీనివాస నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, సభ్యులు రమణారెడ్డి, వెంకటరత్నం, కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శంకరమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు.


