ప్రశాంతి నిలయం: జిల్లాలో గ్యాస్, రేషన్ పంపిణీ పారదర్శకతతో పక్కాగా జరగాలని జేసీ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలులో పౌరసరఫరాలశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలని, బుక్ చేసుకున్న వారందరికీ ప్రాధాన్యత క్రమంలో సిలిండర్లు అందించాలని, డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కమర్షియల్ సిలిండర్లను తొలుత పాఠశాలలు, ఆస్పత్రులకు ఆ తర్వాత వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు అందించాలన్నారు. రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్లు ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
సరుకుల్లో తేడా వస్తే ఫిర్యాదు చేయండి..
రేషన్ సరుకుల నాణ్యత లోపించినా, తూకం తక్కువగా ఉన్నా.. 08555–288566 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సదరు డీలర్పై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వెల్లడించారు. నాణ్యమైన సరుకులు పొందడం హక్కుగా కార్డుదారులంతా భావించాలన్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా అందించే కొత్త బియ్యం వండుకునే విధానం గురించి ప్రజలకు తెలియజేయాలని, ఇందుకోసం ప్రతి చౌక దుకాణం వద్ద పోస్టర్లు ప్రదర్శించాలని జేసీ ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ను పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.
అధికారులకు జేసీ మౌర్యభరద్వాజ్ ఆదేశం


