● అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం
ప్రశాంతి నిలయం: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు మరింత పెంచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. అలాగే జిల్లా అధికారులు రోజూ తప్పనిసరిగా సచివాలయాలను సందర్శించి క్షేత్రస్థాయి పాలనను పర్యవేక్షించాలన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో గ్రామ/వార్డు సచివాలయాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలకు మరింత సులువుగా అందించేందుకు పలు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ సిబ్బంది రోజూ మనమిత్ర ప్లాట్ ఫాం ద్వారా సేవలను అందించాలన్నారు. ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 5 నుంచి 20 వరకూ లావాదేవీలను, సేవలను మనమిత్ర యాప్ ద్వారా పూర్తి చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కారానికి ఐటీ మేనేజర్ను సంప్రదించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఏపీఎస్ సర్వే, మిస్సింగ్ డేటా అప్డేట్లో జాప్యం చేయరాదన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా కూడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. వీలైనన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో డీపీఓ సమత, నోడల్ ఆఫీసర్ జనార్దన్రావు, డీడీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


