పుట్టపర్తిటౌన్: పౌర్ణమి సందర్భంగా సోమవారం సత్యసాయి గిరి రథోత్సవం వైభవంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్కూడలి, ెపెట్రోల్బంక్, చింతతోపులు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా రథాన్ని లాగుతూ తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోస్టల్ సేవలు
మరింత విస్తృతం చేయాలి
● కలెక్టర్ శ్యాంప్రసాద్
హిందూపురం: పోస్టల్ సేవలు మరింత విస్తృతం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం హిందూపురంలోని హెడ్ పోస్టాఫీసులో తన పాస్పోర్టు రెన్యూవల్కు కలెక్టర్ దరఖాస్తు అందజేశారు. అనంతరం పోస్టాఫీసు ఆవరణలో మొక్క నాటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడంతో తపాలా శాఖ ప్రముఖ పాత్ర వహిస్తోందన్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డిబాషా, ఇన్స్పెక్టర్ విమల్కుమార్, పోస్టుమాస్టర్ మార్కండేయులు, తహసీల్దారు వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.
పరిష్కార వేదికకు
105 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 105 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ రెడ్డి, పాల్గొన్నారు.
పేపర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హిందూపురం: స్థానిక సడ్లపల్లి పారిశ్రామికవాడలోని పేపర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పై భాగంలో ఉన్న ప్లాస్టిక్ కవర్లపై పడ్డాయి. కార్మికులు అప్రమత్తమయ్యేలోపు మంటలు చుట్టుముట్టాయి. షెడ్డు పైకప్పు అంటుకుంది. సమాచారం అందుకుఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని సుధాకర్ తెలిపారు.
ఏపీ మహిళా ఉద్యోగుల
సంఘం నూతన కమిటీ ఎన్నిక
పుట్టపర్తి అర్బన్: ఏపీ మహిళా ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ అధ్యక్షురాలిగా శ్యామల, ప్రధాన కార్యదర్శిగా రజిత ఎన్నికయ్యారు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జిల్లా మహిళా ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వినయమోహన్, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పరిశీలకులుగా హాజరయ్యారు. ఎన్నికల అధికారిగా లోకేశ్వరరెడ్డి వ్యవహరించారు. ఆర్థిక కార్యదర్శి జుగ్ను, తదితరులు పాల్గొన్నారు.


