క్రమశిక్షణతో పని చేయండి
పుట్టపర్తి అర్బన్: ఆశా వర్కర్లు క్రమశిక్షణతో పని చేసేలా నోడలాఫీసర్ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో నోడల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఐఓ సురేష్కుమార్తో కలిసి డీఎంహెచ్ఓ మాట్లాడారు. ప్రతి నెలా జరిగే ఆశా డే సమావేశంలో ఆశావర్కర్ల సమస్యలు తెలుసుకొని మెడికల్ ఆఫీసర్ ద్వారా క్లియర్ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో గీవెన్స్కు వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్లో ఉన్న ఇన్సెంటీవ్లను మార్చి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం వంద శాతం లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప, డీసీఎం త్రిలోక్నాథ్, ఆశా నోడలాఫీసర్లు పాల్గొన్నారు.
22న బాలికల
హాకీ జట్టు ఎంపిక
ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈనెల 22న జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే సబ్ జూనియర్ క్రీడాకారులు 01.01.2010 అనంతరం జన్మించి ఉండాలన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ , బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు క్రీడా మైదానంలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
ఇసుకాసురులపై చర్యలు
రామగిరి: పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని నెలలుగా ఇసుకను తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై ‘పెన్నమ్మకు గర్భశోకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... రామగిరి ఎస్ఐ ప్రదీప్రాజ్ శుక్రవారం పెన్నానది పరీవాహక ప్రాంతంలో నిఘా వేశారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న ఏడు ట్రాక్టర్లతో పాటు జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వాహనదారులందరినీ తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. జేసీబీ వాహనానికి రూ.10 వేలు, ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే చర్యలు కఠనంగా ఉంటాయని హెచ్చరించారు.
ఏపీఆర్ఎస్, జేసీ, డీసీల్లో
ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ జూనియర్, డిగ్రీ కాలేజ్ల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ అనిల్కుమార్ శుక్రవారం విడుదల చేశారు. కొడిగెనహళ్లి ఏపీఆర్జేసీ కాలేజ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర గురుకుల ఆశ్రమ విద్యాలయాల్లో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మార్చి నెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఏప్రిల్ 24న నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తామని చెప్పారు. ఏపీఆర్ఎస్ గురుకుల ఆశ్రమ ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. 6, 7, 8వ తరగతి మిగులు సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజ్లతో పాటూ ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు అవకాశముందని పేర్కొన్నారు.
క్రమశిక్షణతో పని చేయండి
క్రమశిక్షణతో పని చేయండి


