బైక్ను ఢీకొన్న కారు – బాలుడి మృతి
తాడిమర్రి: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రిలోని న్యూఎస్సీ కాలనీలో నివాసముంటున్న చిన్నసంటి రామకృష్ణ, జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని రామకృష్ణ ఇంటి వద్దనే ఉంచి పనిపై గ్రామంలోకి వెళ్లాడు. ఆ సమయంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు ఓంసాయి (13), చెల్లెలు కుమారుడు ఆకాష్ ద్విచక్రవాహనంపై చెరువు కట్ట సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు వెళుతుండగా పులివెందుల వైపుగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనలో గాయపడిన ఓంసాయి, ఆకాష్ను స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఓం సాయి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


