
ద్విచక్ర వాహనం నుంచి రూ.5 లక్షల చోరీ
హిందూపురం: ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగులో ఉంచిన రూ.5 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన హిందూపురం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు చిరంజీవి టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పట్టణంలోని కోట ప్రాంతనికి చెందిన చిరంజీవి ఫొటోగ్రాఫర్గా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే అన్నదమ్ముల ఆస్తి వ్యవహారం విషయంలో రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా గురువారం చిన్నమార్కెట్ పక్కనే ఉన్న స్టేట్ బ్యాంకుకు వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్యాంకు నుంచి రూ.5 లక్షలు విత్డ్రా చేశాడు. అనంతరం తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగులో ఉంచి తాళం కూడా వేశాడు. తర్వాత చిన్న మార్కెట్ వద్దకు వచ్చి టీషాపులో తాగేందుకు ఆగాడు. టీ తాగేందుకు పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లాడు. నలుగురు వ్యక్తులు తన ద్విచక్ర వాహనం వద్ద మాట్లాడుతున్నట్లు కనిపిస్తూనే ఉండటంతో కంగారు పడలేదు. టీ తాగిన తర్వాత నేరుగా వాహనం తీసుకొని తన నివాసం సమీపానికి వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనానికి ఉన్న బ్యాగును చూడగా తాళం పీకేసి ఉండటంతో ఆందోళన చెందాడు. బ్యాగులో చూడగా నగదు కనిపించలేదు. కంగారుగా పరిసరాల్లో పరిశీలించాడు. తిరిగి చిన్నమార్కెట్ వద్దకు వెళ్లి వాహనం వద్ద నిలిచి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారేమోనని చూడగా వారు కూడా కనిపించలేదు. పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితుడు చిరంజీవి టూటౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.