
కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు చంద్రబ
పంపనూరు వద్ద కార్మికులతో లైనింగ్ పనులు చేపడుతున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం/ఆత్మకూరు: కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీ–నీవా ప్రాజెక్టును చేపట్టి దాదాపు 90 శాతం పనులను తన హయాంలోనే పూర్తి చేయించారు. కాలువలో జలాలు పారడంతో ఆ మార్గంలోని భూముల్లో నీటి లభ్యత పెరిగి బోరు బావుల్లో నీరు సమృద్ధిగా లభించేవి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ అనుమతులు ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ వచ్చే సరికి ఆ పనులు ముందుకు సాగలేదు.
నాసిరకంగా పనులు..
కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. లైనింగ్ వల్ల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గి భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో లైనింగ్ చేయకూడదని ఒక వైపు రైతులు వాపోతుంటే... కూటమి ప్రభుత్వం మాత్రం ‘తమ్ముళ్ల’ జేబులు నింపడానికి పనులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పనులను 7 ప్యాకేజీలుగా విభజించింది. 1 నుంచి 5వ ప్యాకేజీ వరకు రూ.936.70 కోట్లు, 6,7 ప్యాకేజీలకు రూ.319 కోట్ల ఖర్చుతో పనులు అప్పగించింది. 1,2,3 ప్యాకేజీలు ఆర్వీఆర్ కంపెనీ, 4,5 ప్యాకేజీలు బీఎస్ఆర్ కంపెనీ, 6,7 ప్యాకేజీల పనులు ఎస్ఆర్సీ కంపెనీ వాళ్లు దక్కించుకున్నారు.
ఇష్టారాజ్యంగా పనులు..
హంద్రీ–నీవా లైనింగ్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. సిమెంట్ తక్కువగా వేయడంతో అప్పుడే ఇసుక, కంకర తేలి కనిపిస్తోంది. పూర్తిగా మిషన్లతో పనులు చేపట్టాల్సి ఉన్నా.. దీనికి విరుద్ధంగా కార్మికులతో చేయిస్తున్నారు. ఇక.. లైనింగ్ పనులకు కాంక్రీట్ వేయాలంటే కంకర తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆత్మకూరు మండలంలోని పంపనూరు తండా గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువ పక్కనే మొబైల్ క్రషర్ ఏర్పాటు చేసి కాలువలో ఉన్న రాళ్లతో పాటు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోని కొండ నుంచి రాళ్లను తరలించి కంకర మిషన్లోకి వేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు మొబైల్ క్రషర్కు అధికారులు అనుమతి ఇచ్చారా అనేది కూడా తెలియడం లేదు. కొండలోని రాళ్లను ఎలా కంకరగా తయారు చేసి వినియోగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జేబులు నింపుకోవడానికే..
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించ తలపెట్టిన గండికోట– గాలేరు నగరి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బ్రాంచ్కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడితే హంద్రీ–నీవా లైనింగ్తో పనే ఉండదు. అయినా.. ఆ ప్రాజెక్టులను రద్దు చేసి కేవలం తమ్ముళ్ల జేబులు నింపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండా, పిల్ల కాలువలు ఏర్పాటు చేసి నీరు ఇవ్వకుండా లైనింగ్ పనులకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు అన్యాయం చేస్తూ ఎవరి జేబులు నింపడానికి ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు కష్టాలు తప్పవేమో అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకంగా లైనింగ్ వేయడంతో కంకర తేలిన దృశ్యం
నాసిరకంగా హంద్రీ–నీవా లైనింగ్
ఇష్టారాజ్యంగా పనులు
అప్పుడే పలుచోట్ల కంకర తేలిన వైనం
రైతులు వ్యతిరేకిస్తున్నా లైనింగ్కు తెరలేపిన బాబు సర్కారు
కాంట్రాక్టర్లందరూ టీడీపీ నేతలే

కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు చంద్రబ