
వెంటాడిన మృత్యువు
ధర్మవరం అర్బన్: ఓ యువకుడిని మృత్యువు వెంటాడింది. ఉరివేసుకొని చనిపోవాలనుకున్న అతన్ని కుటుంబ సభ్యులు కాపాడారు. అయితే సెకండ్ల వ్యవధిలోనే మృత్యువు మరోరూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలమేరకు.. ధర్మవరం పట్టణంలోని చంద్రబాబునగర్లో నివసిస్తున్న దేవరపల్లి నాగరాజు హోటల్లో పనిచేస్తున్నాడు. నాగరాజుకు భార్య, కుమారుడు దేవరపల్లి జయకుమార్ (25), కుమార్తె కోమల ఉన్నారు. ఇద్దరూ మగ్గం నేస్తూ తండ్రికి తోడుగా ఉంటున్నారు. మూడునెలల క్రితం మోటార్ సైకిల్పై నుంచి కిందపడి జయకుమార్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న జయకుమార్ ఇక తాను నడవలేనని, దీంతో పాటు సంపాదన కూడా లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక మదనపడేవాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 18న తండ్రి నాగరాజు హోటల్కు పనికి వెళ్లాడు. తల్లి, సోదరి ఇంటి బయట కూర్చున్నారు. ఆ సమయంలో జయకుమార్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుండగా గమనించిన తల్లి వెంటనే జయకుమార్ను కాపాడేందుకు ఇంటిలోపలికి వెళ్లారు. కుమారుడిని తల్లిపైకి ఎత్తి పట్టుకుని ఉండగా చెల్లెలు కోమల ఫ్యాన్కు ఉన్న చీర ముడి విప్పుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జయకుమార్ తల్లి నుంచి జారిపడి మంచం పక్కనున్న మగ్గం డోలు బిగించే ఇనుప రాడ్డుపై పడ్డాడు. ఆ రాడ్డు తల వెనుక లోపలికి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే జయకుమార్ను ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రెడ్డప్ప తెలిపారు.
ఉరి వేసుకొని చనిపోయేందుకు యువకుడి యత్నం
కుటుంబ సభ్యులు కాపాడే యత్నంలో ఇనుప రాడ్ తగిలి మృత్యువాత

వెంటాడిన మృత్యువు