పది మూల్యాంకనం ప్రారంభం
పుట్టపర్తి: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. గురువారం కొత్తచెరువులోని బాల బాలికల ఉన్నత పాఠశాలలో జవాబు పత్రాలను దిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఇందుకోసం సబ్జెక్టుల వారీగా సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. మూల్యాంకనం కోసం ఏఈఎస్లు 582 మంది, సీఈఎస్లు 94 మంది, 188 మందిని సహాయకులను నియమించినట్లు డీఈఓ తెలిపారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏఈఎస్లు 79 మంది, సీఈఎస్లు 17 మంది, 31 మంది సహాయకులను నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో పెనుకొండ డీవైఈఓ పద్మలత, ఏడీ రామకృష్ణ, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు పీవీ రమణారెడ్డి, శెట్టిపి జయచంద్రారెడ్డి, చంద్రశేఖర్, బడా హరిప్రసాద్రెడ్డి, లక్ష్మీనారాయణ, రజనీకాంత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ పనులు
పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్హెచ్ 342, ఎన్హెచ్ 716జీ, జాతీయ రహదారులు, వివిధ భూసేకరణ పనుల పురోగతిపై సంబంధితశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూకేటాయింపుల ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనల మేరకు నివేదికలను రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
పుట్టపర్తి టౌన్: పాఠశాల దశ నుంచే విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి సమాజానికి అవసరమైన ఆవిష్కరణ చేసేలా ఎదగాలని డీఈఓ కృష్ణప్ప ఆకాంక్షించారు. కొత్తచెరువు శాంతినికేతన్ పాఠశాలలో గురువారం ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. డీఈఓ కృష్ణప్ప ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 8 ప్రాజెక్టులను ప్రదర్శించారు. సైన్స్ టీచర్ తనూజ, డైట్ అధ్యాపకులు గోవిందరాజులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులకు ఎంపిక చేశారు. గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు మెమొంటోలు డీఈఓ చేతుల మీదుగా అందజేశారు. డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తగ్గిన చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర తగ్గింది. 15 రోజుల క్రితం వరకూ రూ.30 వేలకు పైగా పలికిన క్వింటా చింతపండు ధర అమాంతం పడిపోయింది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1,097.10 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.24 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.12 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.10,500, కనిష్టంగా రూ.4,300, సరాసరిన రూ.6500 చొప్పున ధర పలికింది. ఇక బోటు రకం క్వింటా రూ.3 వేలు పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
పది మూల్యాంకనం ప్రారంభం
పది మూల్యాంకనం ప్రారంభం
పది మూల్యాంకనం ప్రారంభం


