● డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది’ అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న 2.14 లక్షల ఖాళీ పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడుకునేందుకు కనీస సౌకర్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నేటి నుంచి మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం వీఆర్సీ మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నర్తకీ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ, నాయకులు చైతన్య, నరేంద్ర, సురేంద్ర పాల్గొన్నారు.


