● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ డిమాండ్
నెల్లూరురూరల్: కావలిలో మహిళపై జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, నిందితులపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పోతురాజు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణతోపాటు వైద్య, న్యాయ సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ మాట్లాడుతూ మహిళలను అవమానించే ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చ అన్నారు. ఈ కేసులో చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. సమావేశంలో నెల్లూరు రూరల్ మహిళా అధ్యక్షురాలు పోతురాజు రమాదేవి, మురళి తదితరులు పాల్గొన్నారు.


