● జువ్వలదిన్నె హార్బర్కు తరలింపు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరుపాళెం సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు చెందిన మత్స్యకార పడవ అక్రమంగా చేపల వేటకొచ్చి స్థానిక మత్స్యకారుల వలలను కోస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు నిర్బంధించారు. దుగరాజపట్నం కోస్టల్ సెక్యూరిటీ వివరాల మేరకు.. అక్రమ వేటకొచ్చిన తమిళ బోటు నేలటూరుపాళేనికి చెందిన మత్స్యకారుల వలలను కోయడంతో, ఇంజిన్ చిక్కుకొని కదల్లేని స్థితికి చేరుకుంది. అదే సమయంలో కృష్ణపట్నం సంయుక్త సముద్ర గస్తీ బృందం ఘటన స్థలానికి చేరుకొని పడవను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యశాఖ అధికారులతో కలిసి తదుపరి చర్యల నిమిత్తం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తరలించారు.


