ముత్తుకూరు(పొదలకూరు): భారతమాల ప్రయోజన ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి నిర్మాణానికి గురువారం గోపాలపురంలో అధికారులు సర్వే నిర్వహించారు. నారికేళపల్లి గ్రామం వద్ద నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ గోపాలపురం, కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం సర్వే చేశారు. మండల సర్వేయర్ మస్తాన్, మరి కొందరు సహాయక బృందం సర్వేలో పాల్గొన్నారు. 5.175 కి.మీ మేరకు కృష్ణపట్నం పోర్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గోపాలపురం ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అధిక భాగం నివాస గృహాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. స్లాబ్లతో కూడిన భవనాలు, రేకుల ఇళ్లు, ఖాళీ స్థలాలు, పంచాయతీ ఆస్తులు తదితర వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధరను బట్టి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. బాధితులు తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. పట్టా స్థలాలతో పాటు పోరంబోకు స్థలాల్లో ని నిర్మాణాలను కూడా అధికారులు పరిశీలించారు.


