● 99 సీసీ కెమెరాలు, 26 డ్రోన్లతో పర్యవేక్షణ
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో నగర ఏఎస్పీ దీక్ష బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాతోపాటు వివిధ జిల్లాకు చెందిన 1,743 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దర్గా ఆవరణలో పోలీసు అవుట్ పోస్టు పెట్టారు. దర్గా ఆవరణ, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాల్లో 96 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలూ దర్గా పరిసరాలను నిశితంగా పరిశీలించనున్నారు. 24 డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా మూడు ప్రధాన డైవర్షన్ పాయింట్లు, రెండు భారీ వాహనాల మళ్లింపు మార్గాలుు, 21 పార్కింగ్ ప్రాంతాలు, 20 మూవింగ్ పార్టీలు, 95 ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లను ఏర్పాటు చేశారు. బట్వాడిపాళెం జంక్షన్, డీపీఓ పాయింట్, కేవీఆర్ జంక్షన్, పొదలకూరు రోడ్డు జంక్షన్ వద్ద బారికేడ్లను పెట్టారు.


