జీవనాడికి శాపం | - | Sakshi
Sakshi News home page

జీవనాడికి శాపం

Jun 25 2026 12:30 AM | Updated on Jun 25 2026 12:30 AM

నేడు చలో సోమశిల

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నెల్లూరు సస్యశ్యామలం

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే శ్రీశైలం ద్వారా రోజుకు 3 టీఎంసీలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని జల ప్రాజెక్ట్‌ల అభివృద్ధిని పరుగులు పెట్టించి.. గంగమ్మను ఉరకలెత్తించి సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పాలనలో శాపంగా మారుతోంది. 1996 నుంచి 2026 వరకు ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ జల ప్రాజెక్ట్‌లకు గ్రహణం పట్టుకుంటుంది. చంద్రబాబు పాలనలో 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను దివంగత వైఎస్సార్‌ జలయజ్ఞం ద్వారా 72 టీఎంసీల సామర్థ్యానికి పెంచితే.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 78 టీఎంసీలతో సమగ్ర సోమశిల కల సాకారమైంది. దివంగత వైఎస్సార్‌ హయాంలో ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణానది వరద నీటిని శ్రీశైలం డ్యాం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటిని 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా కాలువలను ఆధునికీకరించారు. ఆ విధంగా కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించారు. ఆ నాడు వైఎస్సార్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తోపాటు కాలువలను అభివృద్ధి చేయకపోయి ఉంటే, నెల్లూరుతోపాటు రాయలసీమ సైతం ఎడారిగా మారేవి. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సోమశిల ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెండింగ్‌ అటవీ భూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్‌ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌ హయాంలో శ్రీకారం చుట్టి సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్‌ జగన్‌ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటీని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఎత్తిపోతల పథకం వస్తే..

ముక్కారు పంటలే

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతికూల పరిస్థితులనూ ఎదురించి దాదాపు 80 శాతం మేర పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించుకునే అవకాశం ఏర్పడేది. రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్‌లు, ఊరూరా చెరువులు జలకళతో నిండుకుండలా మారేవి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. తెలుగుగంగ, ఎఫ్‌ఆర్‌సీసీ, గాలేరు, నగరి ఆయకట్టుకు సాగునీరు, చైన్నెకు తాగునీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారానే విడుదల చేయాలి. అయితే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 841 అడుగుల నీటిమట్టం వద్ద అమర్చారు. ప్రాజెక్ట్‌లో 841 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం తన ప్రాజెక్ట్‌ కాలువలను శ్రీశైలంలో 800 అడుగుట నీటి మట్టంలో నిర్మించారు. దీంతో ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ నీటిని ఎలాంటి అవసరాలు లేనప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీలు, ఎస్‌ఎల్‌పీసీ నుంచి 0.5 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డి, డీఎం ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరశి రోజుకు 6.95 టీఎంసీలు తరలించుకుపోతోంది. అయినా చంద్రబాబు సర్కార్‌ నోరు మెదపలేదు.

నెల్లూరు రూరల్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ గురువారం చలో సోమశిల ప్రాజెక్ట్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కన్వీనర్‌, మాజీమంత్రి సాకే శైలజానాథ్‌, మాజీ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు పలువురు సీమ నేతలు, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సోమశిల ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ ఏర్పాటు జరిగితే సీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఎక్కువగా మేలుజరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరగబోతోందని, అందువల్లనే వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరుబాట పట్టిందని కాకాణి పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడాలన్నారు.

ఈ తరుణంలో ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీలు నీటిని తోడుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూకుడుగా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 20 శాతం పనులు జరిగిన సమయానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు. ప్రభుత్వం మారడం ఈ ప్రాజెక్ట్‌కు శాపంగా పరిణమించింది. తీవ్ర వర్షాభావం నెలకొన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా కనీసం రోజుకు 3 టీఎంసీలు తరలించుకుంటే సీమ జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విలసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలు కరువులో చిక్కుకునే ప్రమాదం ఉంది.

సీమకు ద్రోహం..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement