● రెవెన్యూ అధికారులపై మహిళ ఆరోపణలు
నెల్లూరు(అర్బన్): ‘రెవెన్యూ అధికారులు సకాలంలో సమస్యలు పరిష్కరించడంలేదు. తిప్పుకొంటున్నారు. దొంగలు’ అంటూ నెల్లూరుకు చెందిన సుబ్బరామమ్మ అనే లాయర్ ఆరోపించారు. ఆమె తమ క్లెయింట్లకు సంబంధించిన సమస్యలపై తరచూ కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలిస్తుంటారు. సోమవారం ఆమె కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో, ఇతర జిల్లా అధికారుల ముందు, మంత్రి నారాయణ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై ఘాటుగా ఆరోపణలు చేశారు. ఈ మాటలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి.
చర్యలకు డిమాండ్
రెవెన్యూ వ్యవస్థను కించపరస్తూ మాట్లాడిన సుబ్బరామమ్మ అనే మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచలరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారులను దొంగలంటూ కించపరచడం దారుణమని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.


