మేకపాటికి నల్లపరెడ్డి పరామర్శ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): స్వల్ప అస్వస్థతకు గురై నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డిని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
ఏడీ అనుమతి మేరకే
వాట్సాప్ ద్వారా నోటీసులు
నెల్లూరు(అర్బన్): డ్రగ్ కంట్రోలర్ ఏడీ అనుమతితోనే తాను తన వాట్సాప్ ద్వారా మెడికల్ షాపుల యాజమాన్యాలకు నోటీసులు పంపానని కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘సాక్షి’లో ‘ఔషధ అధికారి దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. తనిఖీలకు వెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులతో నోటీసులు పంపుతున్నారని, ఇంటి వద్దకే పిలుపించుకుని రికార్డులు పరిశీలిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే కథనానికి సదరు డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడన్నారు. దీంతో పెండింగ్ వర్క్ ఉండడంతో డ్రగ్ కంట్రోలర్ ఏడీ అనుమతి తీసుకుని తన వాట్సాప్ ద్వారా నోటీసులు పంపానన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పంపలేదన్నారు. కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పటికీ తన పరిధిలో నెల్లూరులో అనేక డివిజన్లు, బుజబుజనెల్లూరు రూరల్ ఏరియా వంటివి ఉండడంతో పని భారం అధికమైందని అందువల్లనే నెల్లూరులో ఉంటూ డ్రగ్ ఏడీతో అడ్మినిస్ట్రేషన్ విషయాలపై చర్చిస్తున్నానని తెలిపారు.
లింగ నిర్ధారణ చేస్తే
కఠిన చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు (అర్బన్): ఎక్కడైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేసినట్లు తేలితే అలాంటి సెంటర్లను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో గర్భస్థ లింగనిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్డీటీ), సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టం (ఏఆర్టీ) అమలుపై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రాపెట్ అఽథారిటీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించి మాట్లాడారు. గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొంత మంది ఆడ పిల్లలు వద్దనుకుని స్కానింగ్ ద్వారా తెలుసుకుని అబార్షన్లు చేయించుకోవాలను కోవడం అన్యాయమన్నారు. స్కానింగ్ నిర్వహించే సెంటర్లు, ఆస్పత్రులపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. తనిఖీలు విస్తృతంగా చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశా ఖాధికారిణి సుజాత, డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరి, గైనకాలజిస్ట్ ఆండాళ్భాస్కర్, డీఎస్పీ కేసీహెచ్ రామారావు, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓ నేత కవితారెడ్డి పాల్గొన్నారు.
జెడ్పీ ఇన్చార్జి
సీఈఓగా శ్రీధర్రెడ్డి
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, సీఈఓ మోహన్రావు ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు శిక్షణకు వెళ్లనున్నారు. అప్పటి వరకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డిని ఇన్చార్జి డిప్యూటీ సీఈఓ, సీఈఓగా నియమిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 66,322 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 26,000 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
మేకపాటికి నల్లపరెడ్డి పరామర్శ


