
మాకొద్దు
వక్ఫ్ సవరణ చట్టం
నెల్లూరు (బృందావనం): కేంద్రం మొండిగా అమల్లోకి తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమంటూ ముస్లింలు గర్జించారు. వక్ఫ్బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ, వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నెల్లూరు నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దేశాన్ని కాపాడతామంటూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణచివేయడానికి వక్ఫ్బోర్డు చట్టాన్ని సవరించిందని మండిపడ్డారు. ఒకరి ఇంట్లోకి బలవంతంగా దూరి ఆ ఇంట్లో వారిని రక్షిస్తామన్న విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్ నుంచి బయలుదేరిన ఈ భారీ ర్యాలీ గాంధీబొమ్మ వరకు భావోద్వేగపూరితంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వక్ఫ్ చట్ట సవరణలో జరిగిన అన్యాయాలపై ఎలుగెత్తి చాటుతూ నినాదాలు చేస్తూ ర్యాలీగా కొనసాగారు. గాంధీబొమ్మ సెంటర్ను దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు ముస్లిం నేతలు మాట్లాడారు.
కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం
ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వక్ఫ్బోర్డు చట్టాన్ని ఒప్పుకోబోమని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మౌలానా మొహ్మద్ ఇలియాస్ స్పష్టం చేశారు. ఇతర మతస్తులను వక్ఫ్ బోర్డులో నియమించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లింలను అణగ దొక్కేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
చంద్రబాబు ముస్లింల ద్రోహి
సీఎం చంద్రబాబు ముస్లింల ద్రోహి అని, లక్షలాది మంది ముస్లింలు ఓట్లేస్తే గెలిచి దొంగబుద్ధితో ముస్లింలను రోడ్డు మీదకు లాక్కొచ్చాడని వైఎస్సార్సీపీ మైనార్టీ నేత సమీర్ఖాన్ మండిపడ్డారు. ఓటేసిన వారికి ఇలా ద్రోహం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ దేశం మొత్తం మీద ముస్లింలపై కుట్రలు చేస్తున్నారన్నారు. నల్ల చట్టాలకు కాలం చెల్లిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ముస్లిం వ్యతిరేక చట్టాలకు రూపకల్పన చేస్తోందని విమర్శించారు.
హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే
కేంద్రం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ చట్టంతో అన్నదమ్ములుగా ఉన్న హిందువులు, ముస్లిం మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు పెట్టిందని బారాషహీద్ దర్గా ఇమామ్ సయ్యద్ అబూబకర్ అష్రఫి ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా ముస్లింల హక్కులను కాలరాస్తూ, వారికి చెందిన ఆస్తులను ఆక్రమించుకోవడానికి చేస్తున్న కుట్రగా ఉందన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అభివృద్ధి పేరుతో ఈ నల్లచట్టాన్ని తయారు చేసిందన్నారు. హడావుడిగా ఆమోదించడం, ముస్లిం సమాజ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గం, విచారకరమన్నారు.
వెంటనే రద్దు చేయాలి
ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ఈ వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం సమాజానికి ప్రమాదకరమని హాజీ ఇంతియాజ్ అన్నారు. ఈ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింల వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన విధంగానే ఇతర మతాల ఆస్తులకు సంబంధించి రాజ్యాంగ బద్ధమైన అనుమతి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకుండా ముస్లింల వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు.
మిత్రపక్షాల మౌనం సరికాదు
ముస్లిం సమాజానికి ద్రోహం చేసే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షాలు మద్దతు పలకడం సరికాదని జేఏసీ కమిటీ సభ్యులు సయ్యద్ నవీద్అహ్మద్, జాకీర్, షకీల్, సర్దార్, అబ్దుల్గని, అన్వర్బేగ్, అబ్దుల్కరీం విచారం వ్యక్తం చేశారు. 11 మంది ముస్లిం సభ్యు లు ఉండాల్సిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఏడుగురు ముస్లిమేతరులు సభ్యులుగా ఉండడం దారుణమన్నారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు ముస్లిం పురుషులు సభ్యులుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇది వినాశకరమైన చట్టమన్నారు. కేంద్రం పునరాలోచన చేసి ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో ముస్లింల భారీ ర్యాలీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
గాంధీబొమ్మ సెంటర్ దిగ్బంధం

మాకొద్దు