సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా విషయంలో టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కోహ్లి బవుమాపై అసభ్యరీతిలో కామెంట్స్ చేయడం స్టంప్ మైక్లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కేఎల్ రాహుల్ డైరెక్ట్ త్రోకు టెంబా బవుమా రనౌట్ అయ్యాడు. పెవిలియన్ వెళ్తున్న బవుమాను ఉద్దేశించి కోహ్లి.. ''బాగ్ రహా తా మద్..'' అంటూ బూతు మాటలు పలికాడు. కోహ్లి పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు కూడా ఏం పట్టనట్లే ఉన్నారు. అయితే ఇదంతా స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక తొలి వన్డేలో బవుమా, కోహ్లి మధ్య చిన్నపాటి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పంత్కు త్రో వేయబోయిన బంతి బవుమాకు తగలడం.. ఆ తర్వాత బవుమా ఆగ్రహం వ్యక్తం చేయడం.. బదులుగా కోహ్లి అతనిపై కోపం చూపించడంతో రచ్చగా మారింది. అదే గొడవ ఇప్పటికి ఇద్దరి మధ్య వైరం నడిపిస్తూనే ఉంది. తాజా అంశంలో అందరూ కోహ్లినే తప్పుబడుతున్నారు. ఇప్పటికే జాతీయ గీతాలపన సమయంలో చూయింగ్ గమ్ నమిలి అనుచితంగా ప్రవర్తించిన కోహ్లిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా చర్యతో కోహ్లిపై మరింత ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.