
బడ్జెట్లో క్రీడలకు రూ.3,062 కోట్లు
Union Budget 2022: 3062 Crores Allocated For Sports : కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,062.60 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోల్చుకుంటే రూ. 305.58 కోట్లు పెరిగింది. టోక్యో ఒలింపిక్స్లో పెరిగిన పతకాల సంఖ్యతోపాటు ‘ఖేలో ఇండియా’కు మరింత ఊతమిచ్చేందుకు బడ్జెట్ నిధుల్ని పెంచారు.
గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ.2596.14 కోట్లు కేటాయించగా తర్వాత దీన్ని రూ.2757.02 కోట్లకు సవరించారు. కామన్వెల్త్ క్రీడలు (బర్మింగ్హామ్), ఆసియా క్రీడల (హాంగ్జౌ) రూపంలో ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటాయింపుల్ని గణనీయంగా పెంచినట్లు తెలిసింది.
మొత్తం క్రీడల బడ్జెట్లో ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 974 కోట్లు (గతంలో రూ. 657.71 కోట్లు), ప్రోత్సాహక అవార్డులు, రివార్డుల కోసం రూ.357 కోట్లు (గతంలో రూ.245 కోట్లు), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి రూ. 653 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 9 కోట్ల నుంచి 16 కోట్లకు పెంచారు. అయితే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల కోసం గతంలో లాగే ఈసారి రూ. 280 కోట్లు కేటాయించారు.
చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా