ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌ | There was no pressure Not many people know that: vaibhav suryavanshi | Sakshi
Sakshi News home page

‘ఆ విషయం చాలా మందికి తెలియదు.. ఒత్తిడికి లోనుకాను’

Jun 22 2026 7:13 PM | Updated on Jun 22 2026 7:57 PM

There was no pressure Not many people know that: vaibhav suryavanshi

భారత నయా సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి సత్తా చాటాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైఫల్యాలకు చెక్‌ పెడుతూ.. శ్రీలంక -‘ఎ’తో ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉపమానాలే ఈర్ష్య పడేలా... అలంకారాలే అసూయపడేలా... బిరుదులే చిన్నబోయేలా... 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ  ఆదివారం దంబుల్లాలో విధ్వంస రచన చేశాడు.

లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్స్‌లతో లంక తీరంలో పరుగుల తుఫాన్‌ సృష్టించాడు. బౌలర్‌ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు దాన్ని స్టాండ్స్‌లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్లు విరుచుకుపడ్డాడు.

కేవలం 11 బంతుల్లోనే
కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని లిస్ట్‌ ‘ఎ’క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్‌... ఒక్క షాట్‌ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్‌ (Vaibhav Suryavanshi) తో పోటు మిగిలినవాళ్లు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టును ఓడించి భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది.

నిజానికి శ్రీలంకతో గత మ్యాచ్‌లో భారత్‌ సూపర్‌ ఓవర్లో పరాజయం పాలైన వేళ.. వైభవ్‌ను లంక ప్లేయర్‌ విశేన్‌ రెచ్చగొట్టాడు. అందుకు ఫలితంగా ఫైనల్లో ఆ జట్టు మొత్తాన్ని తన ఆట తీరుతో శిక్షించాడు వైభవ్‌. మొత్తంగా 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 324కు పైగా స్ట్రైక్‌రేటుతో 94 పరుగులు సాధించాడు.

ఈ నేపథ్యంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న వైభవ్‌ సూర్యవంశీ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తాను బయటి విషయాలేమీ పట్టించుకోనని.. వన్డేల్లోనూ ఆడగల సత్తా తనకు ఉందని పేర్కొన్నాడు.

పరుగులు చేయలేదని తెలుసు
‘‘ఓపెనర్‌గా మొదటి పది ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనేది నా ఆలోచన. ఈరోజు ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. సిరీస్‌ మొదట్లో ఆశించినంతగా పరుగులు చేయలేదని తెలుసు. అప్పుడు కోచ్‌లతో చర్చించాను.

లోపాలు సరిదిద్దుకుని.. గట్టిగానే ప్రాక్టీస్‌ చేశాను. అందుకు తగ్గ ఫలితం ఫైనల్లో వచ్చింది. ఈ సిరీస్‌ నుంచి చాలానే నేర్చుకున్నాను. అయితే, చాలా మందికి నేను 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడినట్లు తెలియదు. ఏదేమైనా విభిన్నమైన పిచ్‌ల మీద ఆడటం కాస్త సరదాగా.. మరికాస్త సవాలుగా అనిపించింది. 

ఈ సిరీస్‌ నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని వైభవ్‌ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ ‘ఎ’ జట్లు పాల్గొనగా భారత్‌ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్‌ గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో వైభవ్‌ చేసిన పరుగులు వరుసగా.. 14, 44, 21, 38, 94.

చదవండి: నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement