భారత్‌ చేతిలో ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక | Sri Lanka Bags Unwanted Record For Most Defeats In T20Is | Sakshi
Sakshi News home page

భారత్‌ చేతిలో ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక

Jul 31 2024 8:25 AM | Updated on Jul 31 2024 9:07 AM

Sri Lanka Bags Unwanted Record For Most Defeats In T20Is

మూడో టీ20లో భారత్‌ చేతిలో ఓడిన శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 2006 నుంచి ఇప్పటివరకు 195 టీ20లు ఆడిన శ్రీలంక​ 105 మ్యాచ్‌ల్లో (సూపర్‌ ఓవర్‌లతో కలుపుకుని) ఓటమిపాలైంది. 

ఈ మ్యాచ్‌కు ముందు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్‌ (104) పేరిట ఉండేది. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ ఓటములు చవి చూసిన మరో జట్టు వెస్టిండీస్‌. వెస్టిండీస్‌ ఇప్పటివరకు ఆడిన 202 మ్యాచ్‌ల్లో 101 పరాజయాలు ఎదుర్కొంది.

కాగా, శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. 

అనంతరం సూపర్‌ ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి (2/2) భారత్‌ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్‌ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

రెగ్యులర్‌ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు, సూపర్‌ ఓవర్‌లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ ఆవార్డు సొంతం చేసుకున్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement