ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. గత సీజన్లో ఫైనల్కు చేరుకుండానే ఇంటిముఖం పట్టిన ముంబై ఇండియన్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే ముంబై శిక్షణ శిబిరంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా చేరకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్ సమయానికి మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టును భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్లకు అతడు అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, తర్వాతి ఆర్డర్లో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇక ఆల్రౌండర్ల కోటాలో విల్ జాక్స్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్లను బద్రీనాథ్ ఎంపిక చేశాడు. ఫినిషర్గా నమన్ ధీర్కు ఛాన్స్ లభించింది.
ఇక ఫాస్ట్ బౌలర్లగా దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా,ట్రెంట్ బౌల్ట్ త్రయంతో బద్రీనాథ్ వెళ్లాడు. అయితే ఈ జట్టులో వెస్టిండీస్ హిట్టర్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్కు మాత్రం అతడు అవకాశం ఇవ్వలేదు. రూథర్ఫోర్డ్ ట్రేడ్ రూపంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చాడు. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. జాతీయ జట్టుతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు.
బద్రీనాథ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే
రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా


