పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ పదవి నుంచి షాన్ మసూద్ను తొలగించే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. షాన్ మసూద్తో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారులు వారాంతంలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లా చేతిలో పాకిస్తాన్ 0-2తో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన సల్మాన్ అలీ అఘాకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో షాన్ మసూద్, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లు రాబోయే ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగుతారా లేక తొలగిస్తారా అనేది మీటింగ్లో తేలిపోనుంది. ఇదే విషయంపై పీసీబీ సెలెక్టర్ ఒకరు స్పందించారు.
‘పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా సల్మాన్ అలీని నియమించడానికి బోర్డు అధికారులు ఇప్పటికే అనుమతి ఇచ్చారని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నాం. ఇక సర్ఫరాజ్ అహ్మద్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ హెడ్కోచ్ను కూడా మార్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. సర్ఫరాజ్ స్థానంలో మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ హెడ్కోచ్గా వచ్చే చాన్స్ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే సల్మాన్ అలీ అఘా పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగుతున్నాడు. టెస్టు జట్టుకు కూడా అతడే నాయకత్వం వహించనుండడం లాంఛనం కానుంది. అయితే హెడ్కోచ్ పదవికి యూనిస్ఖాన్తో పాటు మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే మీటింగ్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత రానుంది.


