వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం | Our own players Never: Sri Lanka Legend Lauds Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

Jun 20 2026 7:09 PM | Updated on Jun 20 2026 7:35 PM

Our own players Never: Sri Lanka Legend Lauds Vaibhav Sooryavanshi

భారత నయా సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. భారత అండర్‌-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్‌క్యాప్‌ అందుకుని చరిత్ర సృష్టించాడు.

శ్రీలంక పర్యటనలో
ఈ క్రమంలో తొలిసారి భారత్‌- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్‌, అఫ్గానిస్తాన్‌ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్‌ మ్యాచ్‌లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.

ఇదిలా ఉంటే.. వైభవ్‌ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్‌లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్‌ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.

గంటసేపు ఎదురుచూసి మరీ
అయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్‌ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్‌గా పనిచేసిన అనురా తెనాకూన్‌.

ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే
శ్రీలంక- భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.

అతడి బ్యాటింగ్‌ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్‌ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.

అప్పటికే మ్యాచ్‌ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.

మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా
ఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్‌ నా దగ్గరికొచ్చి.. ‘సర్‌. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్‌ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్‌ పేర్కొన్నారు.

కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్లో భారత్‌ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్‌ విశేన్‌.. వైభవ్‌ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్‌ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.

చదవండి: వైభవ్‌ను  టార్గెట్‌ చేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement