
న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానునున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నహాకాల్లో భాగంగా ఈ టూర్ను కివీస్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఆఖరిలో కివీస్ తమ స్వదేశంలో విండీస్తో ఆల్ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బ్లాక్ క్యాప్స్ జట్టు భారత్కు వచ్చే అవకాశముంది. కాగా టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ సన్నాహాల్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సైతం ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లు ఆడనుంది.
న్యూజిలాండ్ చివరగా వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు 2023లో భారత్ పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో బ్లాక్ క్యాప్స్ టీమ్ మూడు వన్డేల సిరీస్లో వైట్ వాష్ కాగా.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో భారత్కు కోల్పోయింది.
ఆ తర్వాత ఏడాది మాత్రం టీమిండియా జరిగిన రెడ్బాల్ సిరీస్లో మాత్రం న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో 3-0 తేడాతో టీమిండియాను కివీస్ చిత్తు చేసింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ను భారత్ మట్టికరిపించింది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్?