
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.
ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంచుకున్నాడు. బంగర్ తన ఎంపిక చేసిన తుది జట్టులో ఓపెనర్లగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్కు అవకాశమిచ్చాడు.
రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా రాహుల్ సరైనోడని స్టార్ స్పోర్ట్స్ చర్చాకార్యక్రమంలో బంగర్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో ఆన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు రావాలని సంజయ్ సూచించాడు.
ఇక ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్కు ఐదో స్ధానంలో ఈ భారత మాజీ క్రికెటర్ చోటు ఇచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిలకు స్ధానం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ను బంగర్ ఎంపిక చేశాడు.
అయితే ఈ మాజీ బ్యాటింగ్ కోచ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం గమనార్హం. జడేజాతో పాటు యువ సంచలనం సాయిసుదర్శన్ను కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బంగర్ ఎంచుకున్న భారత తుది జట్టు
యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్
చదవండి: Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్