స్ప్రింట్‌ ఫైనల్లో నిత్య, నరేశ్‌

National Athletics Championships stsrts in Warangal - Sakshi

400 మీటర్లలో ఫైనల్‌కు జ్యోతికశ్రీ

ఘనంగా జాతీయ అథ్లెటిక్స్‌ షురూ

సాక్షి, వరంగల్‌ స్పోర్ట్స్‌: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌íÙప్‌ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్‌ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్‌ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది.

పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ కె. నరేశ్‌ కుమార్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్‌ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్‌ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్‌ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్‌ పాల్, మహిళల ఈవెంట్‌లో పారుల్‌ చౌదరీ విజేతలుగా నిలిచారు.

పురుషుల విభాగంలో  అభిõÙక్‌ (రైల్వేస్‌) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్‌ (14ని.17.20 సె.), అజయ్‌ కుమార్‌ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్‌ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్‌ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్‌ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్‌ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్‌; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్‌ (రైల్వేస్‌ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు.

మంత్రి చేతుల మీదుగా...
మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top