ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ పేసర్ నవ్దీప్ సైనీకి ఊహించని అవకాశం దొరికింది. వేలంలో అమ్ముడుపోని సైనీని, కేకేఆర్ లీగ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు అక్కున చేర్చుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన హర్షిత్ రాణా స్థానాన్ని సైనీ భర్తీ చేయనున్నాడు.
రోజుల వ్యవధిలో కేకేఆర్లో జరిగిన రెండో కీలక మార్పు ఇది. కొద్ది రోజుల కిందట ఆకాశ్దీప్ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరం కాగా.. అతని స్థానాన్ని సౌరభ్ దూబే భర్తీ చేశాడు. ఇద్దరు కీలక పేసర్లు సీజన్ మొత్తానికి దూరం కావడం అసలే అంతంతమాత్రంగా ఉన్న కేకేఆర్ పరిస్థితిని మరింత దిగజార్చింది.
ప్రస్తుత కేకేఆర్ జట్టులో మతీష పతిరణ మినహా ఒక్క స్టార్ పేసర్ కూడా లేడు. ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ ఓ మోస్తరు గుర్తింపు కలిగిన పేసర్లుగా ఉన్నారు. వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సౌరభ్ త్యాగి రూపంలో దేశీయ పేసర్లు ఉన్నారు.
ఈ సీజన్ కేకేఆర్ అజింక్య రహానే నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మార్చి 29న వాంఖడేలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో కేకేఆర్ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ సీజన్లో రహానేకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రింకూ సింగ్ను ప్రకటించారు. గత సీజన్తో పోలీస్తే ఈ సీజన్లో కేకేఆర్లో చాలా మార్పులు జరిగాయి. రసెల్ ఐపీఎల్కు బైబై చెప్పగా.. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, రోవ్మన్ పావెల్, కెమరూన్ గ్రీన్, రచిన్ రవీంద్ర వంటి విధ్వంసకర బ్యాటర్లు జట్టులోకి వచ్చారు.
గుజరాత్ టైటాన్స్లో ఓ మార్పు
తాజాగా గుజరాత్ టైటాన్స్లోనూ ఓ మార్పు చోటు చేసుకుంది. గాయం బారిన పడిన పృథ్వీ రాజ్ యర్రా స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చాడు. ఖేజ్రోలియా 2018లో RCB తరఫున IPLలో అరంగేట్రం చేశాడు. తర్వాత 2019లో RCB, 2023లో KKR తరఫున ఆడాడు. గత సంవత్సరంలో అతను గుజరాత్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. ఈ సీజన్లో గుజరాత్ ప్రయాణం మార్చి 31న ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో మొదలవుతుంది.


