వారి మధ్య వార్‌లా మారిపోయింది.. ఏమీ చేయలేం: ధోని

IPL 2021: You Cant Do Too much. Cant Put Different Field, MS Dhoni - Sakshi

ముంబై:  కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో -చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. సీఎస్‌కే 18 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విక్టరీ నమోదు చేసింది, చివర వరకూ పోరాడిన కేకేఆర్‌ 202 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఓటమి తప్పలేదు.  కమిన్స్‌ 34 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడ్డా జట్టును గెలిపిం​చ లేకపోయాడు. ఆఖరి వికెట్‌గా ప్రసిద్ధ్‌ కృష్ట రనౌట్‌ కావడంతో కేకేఆర్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఇన్నింగ్స్‌ ముగించాల్సి వచ్చింది. ఆఖరి బంతి వరకూ కేకేఆర్‌ ఆడి ఉండి ఉంటే మ్యాచ్ లో‌ ఇంకాస్త మజా వచ్చేది.  కేకేఆర్‌ ఆటగాళ్లలో రసెల్‌ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేయగా, దినేశ్‌ కార్తీక్‌ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. 

మ్యాచ్‌ తర్వాత విన్నింగ్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ... ప్రత్యేకంగా గేమ్‌లో బౌలర్‌కి, బ్యాట్స్‌మన్‌కి జరిగిన పోరు గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ‘ఈ తరహా గేమ్‌ల్లో ఛేజింగ్‌ అనేది చాలా సులభం అనిపిస్తోంది. మీరు మంచి స్కోరు చేసినా, అవతలి వైపు టీమ్‌ చేయలేకపోయినా కారణం అంటూ ఏమీ ఉండదు. మా పని మేము చేయడం. స్కోరు బోర్డుపై మంచి పరుగులే వచ్చినా మనం వినయంగా ఉండాలి. మనం ఆరంభంలో వికెట్లు తీయలేనప్పుడు,  ప్రత్యర్థి చేతిలో భారీ హిట్లర్లు ఉన్నప్పుడు వారు కచ్చితంగా మెరుపు దాడి చేస్తారు. 

అదే జరిగింది కేకేఆర్‌తో మ్యాచ్‌లో. ప్రధానంగా 16 ఓవర్‌ నుంచి బ్యాట్స్‌మన్‌కు ఫాస్ట్‌ బౌలర్‌కు వార్‌లా మారిపోయింది. అటువంటి సమయంలో మనం ఎక్కువగా ఏమీ చేయలేం. ఫీల్డింగ్‌ కూడా పదే పదే మార్చలేం. మాకు జట్టులో ఉ‍న్న ఒకే ఒ‍క్క స్పిన్‌ ఆప్షన్‌ జడేజా. మా బ్యాటింగ్‌ బాగుంది. రుతురాజ్‌ ఆట చివరి ఐపీఎల్‌ సీజన్‌లోనే చూశాం. అతని క్లాస్‌ మనకు తెలుసు. మన జట్టులో ఉన్న వారి మానసిక స్థితిని తెలుసుకోవాలి. ఒకసారి రుతురాజ్‌ మూడ్‌ బాలేకపోతే అడిగి తెలుసుకున్నా. ఈరోజు నీ ఫీలింగ్‌ ఎలా ఉంది అని అడిగా. ఒకరికి ఒక ప్రశ్న వేసినప్పుడు వారు సమాధానం ఇచ్చే వరకూ వెయిట్‌ చేయాలి. వారి రియాక్షన్‌ ఎలా ఉందో చూడాలి. అది చాలు ఒక మనిషి మానసిక స్థితి తెలుసుకోవడానికి’ అని ధోని తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top