Ind Vs Zim 3rd ODI Live Updates: జింబాబ్వేఫై భారత్‌ విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

India Vs Zimbabwe 3rd ODI 2022: Updates And Highlights In Telugu - Sakshi

India Vs Zimbabwe 3rd ODI Updates: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జింబాబ్వే బ్యాటర్‌ సికిందర్‌ రజా(115) అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్‌ రజా(115) సెంచరీతో చెలరేగగా.. విలియమ్స్‌ 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అవేష్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్‌(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌(50), ధావన్‌(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్‌ సాధించారు.

జింబాబ్వే బ్యాటర్‌ సికిందర్‌ రజా అద్భుతమైన సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో రజా తన సెంచరీని పూర్తి చేశాడు. 47 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. జింబాబ్వే విజయానికి 18 బంతుల్లో 33 పరుగులు కావాలి.

 43 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 7వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. జింబాబ్వే విజయానికి 42 బంతుల్లో 64 పరుగులు అవసరం కాగా.. భారత్‌ విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజులో రజా(84),ఎవాన్స్(14) పరుగులతో ఉన్నారు.

 భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో జింబాబ్వే ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 39 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజులో సికిందర్‌ రజా((65), బ్రాడ్ ఎవాన్స్(4) పరుగులతో ఉన్నారు.

290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 34 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రజా(43), జాంగ్వే(1) పరుగలతో ఉన్నారు.

120 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన చకాబ్వా అక్షర్‌ పటల్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

► 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్‌ వేసిన అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో విలియమ్స్‌(45) రూపంలో పెవిలియన్‌కు చేరగా.. ఆ తర్వాత ఓవర్‌లో మునియోంగా(15) అవేష్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. 20 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 93/3

8 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే ఒక్క వికెట్‌ కోల్పోయి 42 పరుగులు చేసింది. కాగా 12 పరుగులు చేసిన కైటానో రిటైర్‌హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్స్‌(21),టోనీ మునియోంగా(1) పరుగులతో ఉన్నారు.

290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఇన్నోసెంట్ కైయా.. చహర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 8/1

జింబాబ్వేతో నామమాత్రపు ఆఖరి వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(40 పరుగులు), కేఎల్‌ రాహుల్‌(30 పరుగులు) శుభారంభం అందించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ 97 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 130 పరుగులు చేశాడు.

కాగా గిల్‌ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ఇషాన్‌ కిషన్‌ అర్ధ శతకంతో మెరిశాడు. దీపక్‌ హుడా(1) మాత్రం నిరాశపరచగా.. సంజూ శాంసన్‌ 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ ఒకటి, శార్దూల్‌ ఠాకూర్‌ తొమ్మిది పరుగులు చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ సేన 289 పరుగులు స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు లభించాయి.

04:08 PM- ఎవాన్స్‌ మరోసారి అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. వరుసగా గిల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

04:08 PM- అక్షర్‌ పటేల్‌ రూపంలో భారత జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. న్యౌచి బౌలింగ్‌లో సికిందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పెవిలియన్‌ చేరాడు. 4 బంతులు ఎదుర్కొన్న అతడు ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. భారత్‌ స్కోరు: 272/6 (47.4). వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(127 పరుగులు), శార్దూల్‌ ఠాకూర్‌ క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌..
3: 58 PM: టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. వరుసగా రెండు సిక్సర్లు బాది దూకుడు కనబరిచిన సంజూ శాంసన్‌ జోంగ్వే బౌలింగ్‌లో అవుటయ్యాడు. 46వ ఓవర్‌ ఆఖరి బంతికి జోంగ్వే బౌలింగ్‌లో కైటనోకు క్యాచ్‌ ఇచ్చి సంజూ(13 బంతుల్లో 15 పరుగులు) పెవిలియన్‌ చేరాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు: 256-5

శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ కొట్టేశాడు..
3: 45 PM: టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఎట్టకేలకు సెంచరీ గండాన్ని అధిగమించాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో భాగంగా కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. 

3: 42 PM: బ్రాడ్‌ ఎవాన్స్‌ మరోసారి విజృంభించాడు. ఇషాన్‌ అవు​ట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన దీపక్‌ హుడాను ఒక్క పరుగుకే పెవిలియన్‌కు పంపాడు. ఇక కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్న ఎవాన్స్‌కు ఈ మ్యాచ్‌లో ఇది ​మూడో వికెట్‌. దీపక్‌ అవుట్‌ కావడంతో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

3: 38 PM: ఇషాన్‌ కిషన్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీకి చేరువయ్యాడు. ఇషాన్‌ అవుట్‌ కావడంతో దీపక్‌ హుడా  క్రీజులోకి వచ్చాడు.
37 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు కిషన్‌(35), గిల్‌(71)నిలకడగా ఆడుతోన్నారు. 

హాఫ్‌ సెంచరీ చేలరేగిన గిల్‌
భారత యువ ఆటగాడు గిల్‌ తన అధ్బుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన అర్ధసెంచరీతో మెరిసిన గిల్‌.. మూడో వన్డేలో కూడా మరో అర్ధ శతకంను తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌ నిలకడగా ఆడుతోన్నాడు.

02:45 PM:  30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌ 42, కిషన్‌ 12 పరుగులతో ఉన్నారు

02: 34 PM: 26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 109/2 (26).
గిల్‌ 31, ఇషాన్‌ కిషన్‌ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

02:17 PM: ధావన్‌ అవుట్‌
బ్రాడ్‌ ఎవాన్స్‌ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. అర్ధ శతకానికి పది పరుగుల దూరంలో ఉన్న శిఖర్‌ ధావన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 21వ ఓవర్‌ ఆఖరి బంతికి గబ్బర్‌.. సీన్‌ విలియమ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు బ్రాడ్‌ బౌలింగ్‌లోనే రాహుల్‌ అవుటయ్యాడు. ఇక ప్రస్తుతం శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు.


తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
1: 51 PM: జింబాబ్వేతో మూడో వన్డేలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. బ్రాడ్‌ ఇవాన్స్‌ తన అద్భుత బంతితో రాహుల్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సారథి నిష్క్రమించాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 63-1. ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులో ఉన్నారు.

 

1: 30PM భారత ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి గబ్బర్‌ 36 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ రాహుల్‌ మాత్రం ఇంతవరకు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు. 25 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. 

ఓపెనర్లుగా ధావన్‌, రాహుల్‌!
శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ఇక ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 22/0 (5). ధావన్‌ 15, రాహుల్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌..
జింబాబ్వేతో మూడో వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ‘‘మమ్మల్ని మేము చెక్‌ చేసుకునేందుకు ముందు బ్యాటింగ్‌ చేస్తాం. నేను చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉన్నా కదా! ఈ మ్యాచ్‌లో పరుగులు రాబట్టాలని భావిస్తున్నా’’ అని భారత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

ఇక హరారే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణకు విశ్రాంతినిచ్చామన్న రాహుల్‌.. వారి స్థానాల్లో దీపక్‌ చహర్‌, ఆవేశ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. ఆతిథ్య జింబాబ్వే సైతం రెండు మార్పులు చేసింది. వెస్లీ మధెవెరె, తనక చివాంగా స్థానంలో టోనీ, రిచర్డ్‌ను తుది జట్టుకు ఎంపిక చేసింది.

తుది జట్లు:
భారత్‌:

శిఖర్‌ ధావన్‌, కేఎ‍ల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆవేశ్‌ ఖాన్‌.

జింబాబ్వే:
టకుడ్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, టోనీ, రెగిస్‌ చకాబ్వా (కెప్టెన్‌), సికందర్ రజా,  సీన్ విలియమ్స్, ర్యాన్ బరెల్‌, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్‌ నగర్వా.

అద్భుతాలు చేయాలి మరి!
టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలుపొందాలని జింబాబ్వే ఉవ్విళ్లూరుతోంది. బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించిన జోష్‌లో ఉన్న జింబాబ్వే జోరుకు కేఎల్‌ రాహుల్‌ సేన బ్రేక్‌ వేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే వరుసగా 10, 5 వికెట్ల తేడాతో మొదటి రెండు వన్డేల్లో గెలుపొందింది.

తద్వారా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా సొంతగడ్డపై టీమిండియాపై జింబాబ్వే 2010లో చివరిసారిగా వన్డేలో గెలుపు నమోదు చేసింది. ఒకవేళ మూడో వన్డేలో విజయం సాధించాలంటే అద్బుతం చేయకతప్పదు మరి!
చదవండి: Praggnanandhaa: కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ విజేత మాత్రం అతడే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top