IND Vs ZIM 2nd ODI Live Updates: జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం

India Vs Zimbabwe 2nd ODI Match Live Updates-Highligts - Sakshi

జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం..
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌(33),గిల్‌(33) పరుగులతో రాణించారు.

జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే రెండు వికెట్లు పడగొట్టగా.. చివంగా, రజా, న్యాచీ తలా వికెట్‌ తీశారు. ఇక అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. 

గెలుపు దిశగా భారత్‌
జింబాబ్వేతో జరుగుతోన్న రెండో వన్డేలో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 22 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రీజులో దీపక్‌ హుడా(25), సంజూ శాంసన్‌(22) పరుగులతో ఉన్నారు.


మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
83 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. జాంగ్వే బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(28),దీపక్‌ హుడా(3) పరుగులతో ఉన్నారు.

ధావన్‌ ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►నిలకడగా ఆడుతున్న శిఖర్‌ ధావన్‌(33) చివాంగా బౌలింగ్‌లో కైయాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌(2), శుబ్‌మన్‌ గిల్‌(7) క్రీజులో ఉన్నారు.

కేఎల్‌ రాహుల్‌(1) ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
►జింబాబ్వేతో రెండో వన్డేలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. గిల్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్‌ రాహుల్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి న్యౌచి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది.

161 పరుగులుకు చాప చుట్టేసిన జింబాబ్వే
►టీమిండియాతో రెండో వన్డేలోనూ జింబాబ్వే పూర్తి కోటా ఓవర్లు ఆడడంలో విఫలమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 38.1 ఓవర్లలో 161 పరుగులకే చాప చుట్టేసింది. సీన్‌ విలియమ్స్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. రియాన్‌ బర్ల్‌ 39 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ హుడా తలా ఒక వికెట్‌ తీశారు.

34ఓవర్లలో జింబాబ్వే 136/7
►34 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రియాన్‌ బర్ల్‌ 23 బ్రాడ్‌ ఎవన్స్‌ ఆరు పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆరు పరుగులు చేసిన జాంగ్వే శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
►105 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్‌ కోల్పోయింది. 42 పరుగులు చేసిన షాన్‌ విలియమ్స్‌.. దీపక్‌ హుడా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
►టీమిండియాతో రెండో వన్డేలో జింబాబ్వే ఐదో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సికందర్‌ రజా కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
►టీమిండియా బౌలర్లు చెలరేగుతుండడంతో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. సికందర్‌ రజా 6, సీన్‌ విలియమ్స్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే..
►టీమిండియాతో రెండో వన్డేలో జింబాబ్వే రెండో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కైయా శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు ఏడు పరుగులు చేసిన కాటినావోను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం జింబాబ్వే 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. 

6 ఓవర్లలో జింబాబ్వే స్కోరు ఎంతంటే?
►టీమిండియాతో రెండో వన్డేను జింబాబ్వే నెమ్మదిగా ఆరంభించింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో జింబాబ్వే బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. కైయా 4, కాటినో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా
► జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు అదే జోరుతో సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఇక్కడే కప్‌ గెలవాలనే పట్టుదలతో రాహుల్‌ సేన బరిలోకి దిగుతోంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో దుమ్మురేపిన దీపక్‌ చహర్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. చహర్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ తుదిజట్టులోకి వచ్చాడు.

భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ధావన్, గిల్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, సంజూ సామ్సన్, అక్షర్‌ పటేల్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్, ప్రసిధ్‌ కృష్ణ, సిరాజ్‌. 

జింబాబ్వే: రెగిస్‌ చకాబ్వా (కెప్టెన్‌), ఇన్నోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, తనకా చివాంగా 

బంగ్లాదేశ్‌తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు... వారాల వ్యవధిలోనే భారత్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పుడు సిరీస్‌లో నిలిచేందుకో, ఈ మ్యాచ్‌ గెలిచేందుకో కాదు... భారత్‌ ధాటిని ఎదుర్కోవాలని లక్ష్యంతోనే జింబాబ్వే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టీమిండియా సీమర్లను ఆరంభ ఓవర్లలో ఎదుర్కొంటే... గెలుపు, భారీస్కోరు సంగతి అటుంచి కనీసం 50 ఓవర్ల కోటా అయినా ఆడుకోవచ్చని జింబాబ్వే ఆశిస్తోంది.   

పిచ్‌–వాతావరణం 
తొలి వన్డే ఆడిన పిచే! మ్యాచ్‌ ఆరంభంలో కొత్తబంతి సీమర్లు చెలరేగొచ్చు. తర్వాత బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఆటకు అనుకూల వాతవరణం ఉంది. వాన ముప్పే లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top