
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడగా (భారత్ 471, ఇంగ్లండ్ 465).. భారత్కే స్వల్ప ఆధిక్యం లభించింది. 6 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రాహుల్ 98, పంత్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 232 పరుగులుగా ఉంది.
ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతుంది. భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంత క్లాసీ ఆటగాడో అంతే తెలివిపరుడని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఓ సందర్భంలో రాహుల్ తన మాస్టర్ మైండ్ను ఉపయోగించిన తీరును భారత క్రికెట్ అభిమానులు తెగ ప్రశంశిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం రాహుల్కు తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సాయి సుదర్శన్ జత కలిశాడు. సాయి సుదర్శన్ వచ్చీ రాగానే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఎత్తుగడలను మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై అప్పటికే ఒత్తిడిలో ఉన్న సాయి సుదర్శన్పై బెన్ తన స్పిన్ అస్త్రం, పాకిస్తానీ సంతతి ఆటగాడు షోయబ్ బషీర్ను ప్రయోగించాడు.
ఈ సమయంలో రాహుల్ తన మాస్టర్ బుర్రను (సాయి సుదర్శన్ను అలర్ట్ చేసే క్రమంలో) ఉపయోగించాడు. సాయి సుదర్శన్తో హిందీ, ఇంగ్లీష్లో కాకుండా తమిళంలో సంభాషించాడు. పాకిస్తానీ సంతతి వాడైన షోయబ్ బషీర్కు హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్దమవుతుందనే ఉద్దేశంతో రాహుల్ సాయితో తమిళంలో మాట్లాడాడు.
రాహుల్ తనకు అర్దం కాని భాషలో మాట్లాడటం చూసి బషీర్ జట్టు పీక్కున్నాడు. కర్ణాటకు చెందిన రాహుల్కు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలే కాకుండా తమిళం కూడా తెలుసని చాలామందికి తెలీదు. వాస్తవానికి ఈ ట్రిక్కు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వాడేవారు.
పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడే సమయంలో వారికి ఇంగ్లీష్, హిందీ అర్దమవుతాయని ఆ ఇద్దరు దిగ్గజాలు మరాఠీలో మాట్లాడేవారు. తమ వ్యూహాలు ప్రత్యర్ధికి అర్దం కాకుండా భారత దిగ్గజాలు ఈ ఎత్తుగడను ఉపయోగించేవారు. తాజాగా రాహుల్ సచిన్, ద్రవిడ్ మాస్టర్ మైండ్స్ను ఫాలో అయ్యి క్రికెట్ అభిమానులచే శభాష్ అనిపించుకున్నాడు.