ఐపీఎల్-2026 సీజన్ తుది దశలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎస్కే స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా సీజన్ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి స్ధానాన్ని కుల్దీప్ యాదవ్తో సీఎస్కే భర్తీ చేసింది. రూ.30 లక్షల కనీస ధరకు అతడిని సీఎస్కే జట్టులో తీసుకుంది.
29 ఏళ్ల కుల్దీప్ యాదవ్ గతంలో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి పేరిట మూడు ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన నువాన్ తుషారా స్ధానంలో ఇంగ్లీష్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ను ఆర్సీబీ తీసుకుంది.
గ్లీసన్కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. అతడు ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్, డఫీ వంటి వంటి పేసర్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ విభాగం.. ఇప్పుడు మరింత పటిష్టంగా మారనుంది.
స్వదేశానికి వెళ్లిపోయిన రచిన్
అదేవిధంగా కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్ను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సన్నద్దం కోసం అతడు న్యూజిలాండ్కు వెళ్లిపోయినట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది.
గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.2 కోట్ల భారీ ధరకు రవీంద్రను కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభించలేదు. కాగా పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో ఉన్న కేకేఆర్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!


