ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా-ఏ జట్టు ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్లో లంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలున్నాయి.
వైభవ్ తాను ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్కు నిరాశే ఎదురైంది. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదూన్ బౌలింగ్లో ఖాలిద్ తనివాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (48), రుతురాజ్ (3) క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రబ్సిమ్రన్తో పాటు ఆయుశ్ బదోని ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపాడు. మరోవైపు ఆఫ్గన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్గన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తుది జట్లు:
ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్
అఫ్గానిస్తాన్-ఏ: ఇమ్రాన్ మీర్(కెప్టెన్), హసన్ ఈసాఖిల్, ఖలీద్ తనివాల్, ఫైసల్ షినోజాదా, బహిర్ షా, ఫర్మానుల్లా సఫీ, షమ్స్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్


