క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్
Queensland Cricketer Jimmy peirson Cricket Kit Stolen: క్రికెట్ జట్టుపై దొంగలు దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో చోటుచేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్కు ముందు క్వీన్స్ల్యాండ్ జట్టు వాహనంపై దొంగలు దాడి చేసి క్రికెట్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. క్వీన్స్ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు.
ఈ విషయాన్ని పియర్సన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. తన సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్లు చోరీ అయ్యాయని, ఎవరికైనా దొరికితే తనకు తెలియజేయాలంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు.. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్వీన్స్ల్యాండ్-టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 30న బ్రిస్బేన్లో జరగాల్సి ఉండింది. అయితే, బ్రిస్బేన్ నగరంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్ వాయిదా పడింది.
చదవండి: విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!