గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెకెండ్ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో భారత జట్టు సారథిగా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు.
జట్టుతో పాటు గిల్ గువహటికి వెళ్లినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. గిల్ తన గాయం నుంచి కోలుకోనేంందుకు తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత కెప్టెన్ ముంబైలోని డాక్టర్ దిన్షా పార్దివాలా వద్ద చికిత్స పొందనున్నాడు. దీంతో గిల్ నవంబర్ 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశముంది.
గిల్కు ఏమైందంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్కు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని కోల్కతాలోని వుడ్స్ల్యాండ్ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ తర్వాత అతడిని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
అనంతరం నెక్ బ్యాండ్ లేకుండా గిల్ కన్పించడంతో రెండో టెస్టులో ఆడుతాడని చాలా భావించారు. అతడు జట్టుతో పాటు గువహటికి వెళ్లడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ అతడికి ఇంకా పూర్తి స్ధాయిలో నొప్పి తగ్గలేదు. అందుకే అతడిని రెండో టెస్టు నుంచి బీసీసీఐ తప్పించింది.


