
అంతర్జాతీయ టోర్నీల్లో గెలిచిన ప్లేయర్లకు నజరానాలు
రూ.9.75 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైన ‘బాయ్’
న్యూఢిల్లీ: భారత్లో అంతర్జాతీయ స్థాయి షట్లర్లు నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో మేటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నాణ్యమైన విదేశీ కోచ్ల పదవీ కాలం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆటకు, ఆటగాళ్లకు ఊతమిచ్చే కార్యక్రమాలు చేపట్టడం, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్లకు నగదు పురస్కారాలు అందజేయాలని ‘బాయ్’ నిర్ణయించింది. ఈ మేరకు ‘బాయ్’ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.
దీనికోసం ప్రతియేటా రూ. 9 కోట్ల 75 లక్షలు ఖర్చు చేయాలని భావిస్తోంది. వివిధ సెంటర్లలో ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్న మాజీ ఆటగాళ్లు జీత భత్యాలు పెంచడంతో పాటు పతకాలు తెచ్చిన షట్లర్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు క్రమం తప్పకుండా అందజేయాలని చూస్తోంది. సీనియర్ జాతీయ ర్యాంకింగ్ పోటీల విజేతలకు రూ. 10 లక్షల చొప్పున, అండర్–19 ఈవెంట్ విజేతలకు రూ. 8 లక్షలు, మిగతా వయో విభాగాల విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.