యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు | ACC Womens Asia Cup Rising Stars 2026: UAE Beat India A By 7 Wickets | Sakshi
Sakshi News home page

Asia Cup 2026: యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు

Feb 13 2026 6:52 PM | Updated on Feb 13 2026 6:55 PM

ACC Womens Asia Cup Rising Stars 2026: UAE Beat India A By 7 Wickets

PC: BCCI X

భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది.

బ్యాంకాక్‌ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ వుమెన్‌-‘ఎ’ జట్టు నేపాల్‌ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్‌థాయ్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రాణించిన అనుష్క శర్మ, తనూజ
ఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్‌ (16)లతో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ తేజల్‌ హసబ్నిస్‌ (1) కూడా విఫలమైంది. కెప్టెన్‌ రాధా యాదవ్‌ (7), మిన్ను మణి (8), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.

ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్‌ తనూజ కణ్వార్‌ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్‌ (4), సైమా ఠాకూర్‌ (3 నాటౌట్‌) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్‌ కేవలం 130 పరుగులే చేసింది.

యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్‌, కెప్టెన్‌ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.

ఇషా ఓజా అజేయ హాఫ్‌ సెంచరీ
ఓపెనర్లలో కెప్టెన్‌ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తీర్థ సతీశ్‌ (10) నిరాశపరిచింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్‌కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్‌ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్‌ బాది అజేయంగా నిలిచింది.

ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్‌ ఇషా ఓజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. 

చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్‌ అవుట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement