5 Paise Biryani: ఐదు పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎక్కడంటే..

Tamil Nadu: 5 Paise Biryani In Sellur, Madurai - Sakshi

మధురై (తమిళనాడు): బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజనప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్‌ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్‌ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్‌ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.


సెల్లూర్‌లో బిర్యానీ కోసం ఎగబడిన ప్రజలు

తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్‌ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్‌ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్‌ ముందు వరుస కట్టారు. చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్‌ తాకిడిని తట్టుకోలేకపోయింది. 300 మందికి ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. అంతమంది తరలిరావడంతో యాజమాన్యం హోటల్‌ షట్లర్లు మూసేసింది. ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో దిండిగల్‌ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్‌ ప్రకటించారు.


జనాల తాకిడికి దుకాణం మూసివేసిన నిర్వాహకులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top