● రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతారెడ్డి
● కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన వేడుకలు
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంత నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తుందన్నారు.
రైజింగ్– 2047తో ముందుకు
ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం చూపే పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన, సామాజిక న్యాయం అనే నాలుగు ప్రధాన స్తంభాలపై ప్రజా ప్రభుత్వం పాలనను కొనసాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్–2047 దార్శనిక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో
గ్రామీణ తెలంగాణను బలోపేతం చేసేందుకు పల్లె ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి సాధించాలని దశల వారీగా అమలు చేస్తుందన్నారు. ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చెందేలా ప్రజలకు చేరువైన పాలనను అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ కార్డును అర్హులందరికీ అందిస్తామన్నారు. ఈ 1000 రోజుల ప్రజాపాలనలో రాష్ట్ర ప్రగతితో పాటు జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


