ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సెమినార్లో పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ ఘనపూర్ పాఠశాలకు చెందిన నిహారిక ప్రథమ స్థానం, టీజీఎంఎస్ లచ్చపేటకు చెందిన జమీల ద్వితీయ స్థానం, పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ దుబ్బాకకు చెందిన రేణు శ్రీ తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజమౌళి, న్యాయ నిర్ణేతలు నరసింహారెడ్డి, భగవాన్ పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం రైస్ మిల్లర్ల యజమానులు గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ వేధింపుల చర్యలు మాను కోవాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని, రవాణా చార్జీలు ఇవ్వాలని, నిల్వలో 15 నుంచి 20 శాతం తేడాలు ఉన్నా కేసులు నమోదు చేయవద్దు అని పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు.
దుబ్బాకటౌన్: 22–ఏ భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు అనుమాండ్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాయపోల్లో ఆయన మాట్లాడుతూ.. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ, వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు 22ఏ జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, నాయకులు దయాకర్, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.


