చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని ఎన్ఎస్డీసీ జిల్లా మేనేజర్ శిరీష అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. న్యాక్ కోఆర్డినేటర్ లక్ష్మినర్సింహులు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ కో ఆప్షన్ (క్రిస్టియన్) సభ్యురాలిగా కాతా అలియాస్ మారుపాక గ్లోరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రకటించారు. గత మే నెలలో మొత్తం నలుగురు కో ఆప్షన్ సభ్యులకు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గ్లోరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించి మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లకు, మంత్రి పొన్నంకు గ్లోరినా ధన్యవాదాలు తెలిపారు. పాలకవర్గ సభ్యులతో కలిసి మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.
గజ్వేల్రూరల్: ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటుతో ఎన్నుకోబడిన నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించి తమ బాధ్యతను నిర్వర్తించాలని గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల పీఎంశ్రీ మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెసా అన్నారు. శుక్రవారం పాఠశాలలో స్కూల్ కేబినెట్ ఎలక్షన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో 560మంది విద్యార్థులతో పాటు 20 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పాఠశాల కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, స్పోర్ట్స్ కెప్టెన్తో పాటు మరో 4 విభాగాలలో కెప్టెన్లను, కార్యవర్గాన్ని విద్యార్థులు ఎన్నుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడడంతో పాటు సమస్యల పరిష్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు.
జిల్లా ఉపాధికల్పన అధికారి ప్రియాంక
సిద్దిపేటరూరల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని భవిష్యత్ను నిర్మించుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి, ప్రియాంక విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండల పరిధిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ పాఠశాలలోని 9వ,10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రియాంక హాజరై మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారని, డిప్లొమా కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించే ఉన్నాయన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ,కెమికల్ ఇండస్ట్రీ వంటి నైపుణ్య కోర్సులలో ఉత్తీర్ణులైతే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మూరి పద్మ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


