కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారి మల్లన్న నామస్మరణతో మార్మోగింది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టడంలాంటి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొని కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు. భక్తులకు కావల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఆలయానికి సుమారు రూ.4 లక్షల విలువచేసే వెండి బిందెను కొమురవెల్లికి చెందిన అంబటిపల్లి యాదలక్ష్మి కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


