ఏళ్ల కొద్దీ ఓటేసిన వారికి తప్పని శ్రీముఖాలు జాబితా వివరాలతో పొంతన లేదని ఆక్షేపణ డిక్లరేషన్ తప్పనిసరి అంటూ ఆదేశాలు
బల్దియాలో 27 వేల మందికి నోటీసులు
ఈ పక్కన ఫొటోలో ఉన్నది..మహ్మమద్ అలీ వయస్సు 63. స్థానికంగా 33 వార్డులో నివాసం ఉంటున్నాడు. 2002 ఓటరు జాబితాలో ఈయన పేరు ఎం.డి అలీ అని ఉంది. అదేవిధంగా ఈయన తండ్రి పేరు 2002లో మాలిక్ అని ఉండగా ప్రస్తుత ఓటరు జాబితాలో మహ్మమద్ మాలిక్ అని ఉంది. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ వివరాల్లో తేడాలున్నాయని తండ్రి కొడుకులిద్దరికీ నోటీసులు వచ్చాయి. నిర్ణీత గడువులోగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు.
ఈ ఫొటోలో ఉన్నది అమీన్పూర్ సుశీలా. ఈమె వయస్సు 50 ఏళ్లు. స్థానికంగా 25వార్డులో 25 ఏళ్లుగా నివాసం ఉంటుంది. 15 ఏళ్లుగా జరిగిన మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు సద్వినియోగం చేసుకుంది. ఇప్పుడు 2002లోని ఓటరు జాబితాలో మీ వివరాలు లేవని, మీకు ఓటరు జాబితాలో ఏ ప్రాతిపదికన ఉండాలో సరైన వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.వీరిద్దరిలాగానే చాలామందికి ఇలాగే నోటీసులు జారీ అయ్యాయి.
సిద్దిపేటజోన్: ఓటరు వయస్సు, ఇంటి పేరులో అక్షరదోషాలు, చిరునామా, తండ్రి పేరు, పిల్లల పేర్లు, కవల పిల్లల వయస్సులో తేడాలు, తదితర తప్పిదాల పేరిట బల్దియాలో వేలాదిమందికి నోటీసులు జారీ అయ్యాయి. ఒక్క సిద్దిపేట మున్సిపాలిటీలో 6,005 మ్యాపింగ్ కానీ వారికి, 21,530 మందికి మ్యాపింగ్ సందర్భంగా 2002 ఓటరు జాబితా, ఎన్యూమరేషన్ పత్రాల వివరాల్లో పొంతన లేదని మొత్తంగా 27,435మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరంతా అధికారులు సూచించిన తేదీల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12రకాల ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(సర్) సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా జాబితా–2002 ఓటరు జాబితా వివరాలు పొంతన లేని తప్పుల తడకగా మారింది. 2002లో ఇంటిపేరు పూర్తిగా రాయకుండా, వయస్సు అంశంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాయడం, తండ్రి, వయస్సుతో సంతానం వయస్సు సరిపోలేదని, అక్షర దోషాల జాబితాలో పేర్లలో వ్యత్యాసం ఉందని చిన్న చిన్న తప్పుల ఆధారంగా నోటీసులు జారీ అయ్యాయి.
జిల్లాలోని ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ‘సర్’ప్రక్రియలో భాగంగా అధికారులు 27,435మందికి నోటీసులు జారీ చేశారు. 2002 ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ కాలేదని 6,005మందికి నోటీసులిచ్చారు. అదేవిధంగా ఎన్యూమరేషన్ పత్రాల వివరాలు 2002 జాబితాలో వివరాలకు పొంతన లేదని 21430మందికి నోటీసులు జారీ అయ్యాయి. ముఖ్యంగా 6,005మంది ఎన్నికల కమిషన్ సూచించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాలు చూపించి ఆర్డీఓ స్థాయిలో డిక్లరేషన్ కోసం స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. వీటికి జిల్లా కలెక్టర్ అప్రూవల్ తర్వాతే ఓటుహక్కు లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్లరికల్ తప్పిదాల పేరిట నోటీసులు జారీ అయినా 21,430 మంది బీఎల్ఓ విచారణ అనుగుణంగా ఆర్డీఓ స్థాయిలో సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డుల్లోని 174 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా 27,435 నోటీసులు జారీ అయ్యాయి. పోలింగ్ కేంద్రం 06లో అత్యధికంగా 448 నోటీసులు జారీ కావడం విశేషం


