సర్కార్ బడులు మూసివేస్తే సహించం
తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు లేరనే నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే కుట్రను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తిప్పికొడుతుందని తపస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్యలు అన్నారు. జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ విస్తరణ సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నూతన కార్యవర్గ సభ్యులుగా ముండ్రాతి రాములు, గంట్యాల వెంకటేశం, గడీల శ్రీకాంత్, అనుముల వీరేశం, ఎండబెల్లి గోపాల్ రెడ్డి, భాస్కరాచారి, వీరారెడ్డి, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జీవో నంబర్ 25ను సవరించకుండా హేతుబద్ధీకరణ చేపడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలనే కుట్రను తిప్పికొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపడతామన్నారు. ఉపాధ్యాయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో తపస్ ఉపాధ్యాయులు ముందుంటారని అన్నారు.


