సాగునీటి కాల్వలను పట్టించుకోని సర్కార్
● దుబ్బాక నియోజకవర్గంపై వివక్ష వీడాలి ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. సాగునీటి ఉప కాల్వల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి కాల్వల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కాల్వలు, ఉప కాల్వల నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు చెందిన రామాయంపేట, శంకరంపేట, ఉప్పర్పల్లి, దుబ్బాక ప్రధాన కాల్వల ద్వారా సాగునీటి సౌకర్యం ఉందన్నారు. నేడు ఉప కాల్వల నిర్మాణం జరగక పక్కనే నీళ్లు ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికై నా వివక్ష వీడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకొని ఉప కాల్వల నిర్మాణానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఉప కాల్వల పూర్తయితే తమ నియోజకవర్గంలో 1.20లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి స్వరూపంపై అధికారులు సమగ్ర నివేదిక తనకు అందజేస్తే...సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమీక్షలో గజ్వేల్, సిద్దిపేట ఇరిగేషన్ శాఖ ఎస్ఈలు సుధాకిరణ్, లక్ష్మణ్లతోపాటు ఈఈలు, డీఈలు, తహసీల్దార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


