లక్ష్యం వైపు అడుగులు..
● మార్కెట్ కమిటీల ఆదాయం టార్గెట్ రూ.45.3 కోట్లు ● జనవరి వరకు వచ్చింది రూ.32.81 కోట్లు ● రెండు నెలల్లో లక్ష్యం చేరుకునేలా ప్రణాళిక
గజ్వేల్: జిల్లాలోని మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్యం ఎలాగైనా చేరుకునేలా అధికారుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ ఫీజు ద్వారా రూ.45.35కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉండగా, జనవరి నెలాఖరు నాటికి రూ. 32.81 కోట్ల ఆదాయం సమకూరింది. కీలకంగా భావించే ప్రస్తుత ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.13కోట్ల రాబడి సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ కమిటీల ద్వారా ఈసారి అనుకున్న ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేలా సంబంధిత శాఖ అధికారులు ముందుకుసాగుతున్నారు. జనవరి నెలాఖరు వరకు రూ. 32.81 కోట్ల ఆదాయం సాధించగలిగారు. రూ. 45.35క ోట్ల లక్ష్యానికి ఇంకా రూ. 13 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉన్నది. ఈనెల 18న రామాయంపేటలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి మార్కెట్ కమీటీల సమీక్షను నిర్వహించి, లక్ష్య సాధనపై దిశానిర్ధేశం చేశారు. దీని తర్వాత స్థానిక అధికారులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టారు.
జిల్లాలోని 14 మార్కెట్ కమీటీలకు వరి, పత్తి,మొక్కజొన్న, కందులు, శనగలు, పెసర్లు, వేరుశనగ, కూరగాయలు తదితర ఉత్పత్తుల క్రయ విక్రయాల ద్వారా మార్కెట్ ఫీజురూపంలో ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వ సంస్థలు, వ్యాపారు లు తమ చేసిన క్రయవిక్రయాల్లో 2 శాతం మార్కెట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తుల విక్రయా లపై వచ్చే మార్కెట్ ఫీజు, చెక్పోస్టులు, మడిగెల ఆద్దెలు, ఇతర వనరులతోపాటు ప్రైవేటులో మక్కలు, కందులు, శనగలు, పెసర్లు తదితరాల కొనుగోళ్లు జరిగితే ఆదాయం సమకూరుతుంది.
గజ్వేల్లో వడ్ల కొనుగోళ్లు (ఫైల్)
మార్కెట్ల వారీగా ఆదాయం..
జనవరి నెలాఖరు నాటికి జిల్లాలోని సిద్దిపేట మార్కెట్ కమిటీకి రూ. 409.19 లక్షలు, గజ్వేల్కు రూ. 187.48 లక్షలు, చిన్నకోడూర్కు రూ. 206.07 లక్షలు, నంగునూరుకు రూ. 123.37లక్షలు, తొగుటకు రూ. 94.58 లక్షలు, దౌల్తాబాద్కు రూ.169.39 లక్షలు, కొండపాకకు రూ. 157.81 లక్షలు, మిరుదొడ్డికి రూ.170.27లక్షలు, దుబ్బాకకు రూ. 259.90 లక్షలు, బెజ్జంకికి రూ. 260.20 లక్షలు, హుస్నాబాద్కు రూ. 461.95 లక్షలు, కోహెడకు రూ.144.85లక్షలు, చేర్యాలకు రూ. 512.41 లక్షలు, వంటిమామిడికి రూ. 124.05 లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా అన్ని మార్కెట్ కమిటీల్లో కలుపుకొని రూ. 32.81 కోట్ల ఆదాయం సమకూరింది. అయినా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఆదాయం పట్ల సంతృప్తి చెందలేదు. లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో మార్కెట్ కమిటీల్లో ఆదాయం పెంపుపై దృష్టిపెట్టాయి. పత్తి ఉత్పత్తులు అతివృష్టి కారణంగా గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితి లేకుండా ఉంటే ఈపాటికే పత్తి ద్వారా వచ్చే ఆదాయంతోనే టార్గెట్ చేరుకునేవారు. కానీ పరిస్థితి భిన్నంగా మారింది. దీనివల్ల అధికారులు...గతంలో నుంచి భారీగా పెండింగ్లో ఉన్న పత్తి, వరి క్రయవిక్రయాల మార్కెట్ ఫీజు వసూలపై దృష్టి పెట్టారు. దీనివల్ల ఈ రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటామనే ధీమాలో ఉన్నారు.


